ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దుకు జోక్యం చేసుకోండి: గవర్నర్ కు లేఖ రాసిన నారా లోకేశ్

  • ఏపీలో కరోనా కల్లోలం
  • పబ్లిక్ పరీక్షల నిర్వహణ విరమించుకోవాలన్న లోకేశ్
  • ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి
  • తాజాగా గవర్నర్ కు విన్నపం
  • విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకోవాలని వినతి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఈ అంశంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. పరీక్షల రద్దు అంశంలో జోక్యం చేసుకోవాలని లోకేశ్ ఏపీ గవర్నర్ ను కోరారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3 లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని.... అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంలా మారుతుందని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఇప్పటివరకు దాదాపు 20 రాష్ట్రాలు టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేశాయని లోకేశ్ వెల్లడించారు. అందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవడం కరోనా వైరస్ ను మరింత వ్యాప్తి చేయడమేనని విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించడం అసాధ్యమని తెలిపారు.

ఏ ఒక్క విద్యార్థి కరోనా బారినపడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుందని స్పష్టం చేశారు. అందుకే గవర్నర్ కు ఉన్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని లేఖ రాశానని వివరించారు. అంతేకాదు పరీక్షల అంశంలో ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1,778 పేజీలను కూడా లేఖకు జతచేసి పంపానని లోకేశ్ తెలిపారు.

Nara Lokesh
Governor
Biswabhusan Harichandan
Letter
Tenth
Inter
Exams

More Telugu News